మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌తో మార్కెట్‌ డౌన్‌..!

మూడు రోజులుగా  రికార్డు ర్యాలీ చేస్తున్న మార్కెట్‌ మూడ్‌ను ''మూడీస్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌'' దెబ్బతీసింది. ఫలితంగా ఈ వారాంతాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 330 పాయింట్లు నష్టపోయి 40323 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 12000 దిగువున 11908 వద్ద స్థిరపడ్డాయి. ఆర్థిక, సంస్థాగత బలహీనతలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. గతంలో తాము కేటాయించిన ''స్థిరత్వం'' రేటింగ్‌ను ''నెగిటివ్‌''కు తగ్గిస్తున్నట్లు రేటింగ్‌ తెలిపింది. మరోవైపు నిన్నరాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిసినప్పటికీ.., నేడు ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, అలాగే మూడు రోజులుగా మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫార్మా, మెటల్‌, ఐటీ, అటో, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ మిడ్‌క్యాప్‌ షేర్లల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్‌ విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ., ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం విశేషం. ఈ ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఇంట్రాడే ఒకానొకదశలో సూచీలు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 96 పాయింట్లు పెరిగి  40,749.33 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,034.15 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే మార్కెట్‌ చివరి గంట అనూహ్య అమ్మకాలు సూచీలు ర్యాలీ కొనసాగించడంలో విఫలమయ్యాయి. ప్రైవేట్‌రంగ షేర్లలో కొనుగోళ్ల నెలకొనడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.38శాతం లాభపడి 30,749 వద్ద స్థిరపడింది.